పూణె – ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు..

– ముంబయిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
ముంబై : పూణె నుంచి ఢిల్లీ వెళ్తున్న ఆకాశ విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబయి ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ఓ ప్రయాణికుడి తన బ్యాగులో బాంబు ఉందని బెదిరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో విమానాన్ని ముంబయి ఎయిర్‌పోర్టుకు మళ్లించి, ల్యాండ్‌ చేశారు. 40 నిమిషాల పాటు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లభ్యం కాకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం విమానం ఢిల్లీకి బయల్దేరింది. అయితే బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడు, తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో, ముంబయిలో విమానం ల్యాండైన వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతనికి మెడిసిస్స్‌ ఇచ్చి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.