నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ పార్టీ ఎంపీని ఉద్దేశించి పార్లమెంట్లో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలకు బీజేపీనే బాధ్యత వహించాలని బీఎస్పీ మైనార్టీ విభాగం కన్వీనర్లు అబ్రార్ హుసేన్ ఆజాద్, మౌలానా షఫీ మసూది డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు సాంబశివగౌడ్, అరుణతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.లోక్సభలో బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని ముల్లా టెర్రరిస్ట్ అంటూ బిధూరి చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితమైనవన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు,వాడిన భాష ఒక మతాన్ని కించపర్చేలా ఉన్నాయని తెలిపారు. తక్షణమే బీజేపి ఎంపీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలనీ, అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో రాజ్యాంగ విలువలు, మత సామరస్యాన్ని దెబ్బతీయటమే బీజేపీ పనిగా ఉందని విమర్శించారు.