ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్ర మైన సమస్యల్లో అవినీతి ప్రధానమైనది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారి పోతు న్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది. లంచగొండితనం రాజ్యమేలు తున్నది. ఆకలి కన్న తీవ్రమైన సమస్యగా అవినీతి నిల బడి ఉన్నది. లంచం ఇవ్వనిదే ఫైలు కదలనంటున్నది. అమ్యామ్యాల మేతతో అక్రమార్కులు పేట్రేగిపోతు న్నారు. అక్రమార్జనలే నవ్య నాగరికత అవుతున్నది. అధి కారం అవినీతికి రాచబాట అయ్యింది. కీచక రాజకీయ నాయకుల ఆదేశాలే అలిఖిత చట్టాలయ్యాయి. నీతిమం తుడు చేతకాని వాడుగా పరిగణించబడుతున్నాడు. అవినీతి, లంచగొండి తనం అనేవి సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలుగా అవతరించాయి. అవినీతి రహిత సమాజ స్థాపనకు పూనుకోవడం, మూలాలను అన్వేషిం చడం, అక్రమార్కులను శిక్షించడం, చట్టాలను రూపొం దించి కఠినంగా అమలుపరచడం లాంటి పలు అంశా లను చర్చించే ఐరాస వేదికగా ”అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని” ప్రతి యేటా 09 డిసెంబర్ 2005 నుంచి పాటించుట ఆనవాయితీగా మారింది.
ఐరాస గణాంకాల ప్రకారం ప్రతియేటా ఒక ట్రిలి యన్ డాలర్లు అవినీతిపరుల జేబులకు చేరుతూ, 2.6 ట్రిలియన్ డాలర్లు అక్రమ మార్గంలో దోపిడీ చేయబడు తున్నాయి. ప్రపంచ జీడీపీలో ఐదు శాతం వరకు అవి నీతిపరుల చేతులు మారుతున్నది. మానవాళి సమగ్రా భివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలుస్తున్న అవినీతి అంతా నికి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, బాధ్యత గల పౌరులు, ప్రయివేట్ సంస్థలు తమవంతు చేయూతను ఇవ్వాలి. అవినీతి పెరి గితే పేదరికం, అశాంతి, హింస, ఆర్థిక మందగమనం, నేర ప్రవృత్తి, ఆకలిచావులు, ఆర్థిక అసమానతలు రాజ్య మేలుతాయని చరిత్ర బోధిస్తున్నది. నేర చరితులే నవ నాయకులుగా అవతారమెత్తుతున్నారు. అవినీతితో ప్రజా స్వామ్యం పరిహాసించబడడం, ప్రభుత్వాలు అస్థిరత్వం పాలు కావడం, దేశ ప్రగతి తిరోగమన దిశగా కదలడం జరుగుతాయి. చట్టాల లొసుగుల్ని గమనించడం, రంధ్రాన్వేషణ చేయడం, అధికారంతో రక్షణ పొందడం, పౌరుల అవసరాలను అలుసుగా తీసుకోవడం, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి, లంచం తీసుకోవడం, భావ కాలుష్యం లాంటివి అవినీతి దురాచారాలుగానే పరిగ ణించబడతాయి. అవినీతి, అధికార దుర్వినియోగాలు వ్యక్తి స్వేచ్ఛ, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, మానవ హక్కులు, సామాజిక న్యాయం, ప్రభుత్వ పాలన, సమాజ భవిష్యత్తులకు విఘాతంగా మారుతున్నాయి.
ప్రపంచ దేశాల్లో అవినీతిని కొలువడానికి ”కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (సిపిఐ)” సూచిక ద్వారా నిర్ణయించి పోలుస్తారు. సిపిఐ 100 ఉన్న దేశాన్ని అవినీతిరహిత దేశంగా, జీరో ఉన్న దేశాన్ని అత్యంత అవినీతి కలిగిన దేశంగా వర్గీకరిస్తారు. 180 ప్రపంచ దేశాల సిపిఐ జాబి తాను చూస్తే ఇండియా 85వ స్థానంలో ఉంది. అవినీతి, లంచగొండితనం అధికంగా వ్యాపించిన భారతంలో నీతివంతమైన సమాజం మాయమైపోయింది. దేశ ప్రగతి నిరోధకంగా అవినీతి చెదలు నిలుస్తున్నది. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, అవిద్య, వాతావరణ కాలుష్యం, పేదరికం లాంటి సమస్యలకు అవినీతి కారణం అవుతున్నది. పోలీసు, రెవెన్యూ శాఖల్లో అవినీతి అనకొండలు బుసకొడుతున్నాయి. ప్రభుత్వ పథకాలు బడుగులకు చేరేసరికి సన్నబడుతున్నాయి. అక్రమార్కు లను పట్టుకోవడం, లంచాల ఎరచూపి బయటపడడం సర్వసాధారణమైంది. అవినీతి వ్యతిరేక చట్టాలు మూలనపడి మూలుగుతున్నాయి. అధికారి నుంచి బంట్రోతు వరకు, వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రి వరకు అందరికీ అవినీతి మరకలు అంటుతూనే ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయంలో పని కావాలంటే పైకం ముట్టాల్సిన పరిస్థితి! తూకంలో మోసాలు, నకిలీ సామాన్లు, పన్ను ఎగవేతలు, కల్తీ లీలలు, ఆన్లైన్ మోసాలు లాంటివి సామాజిక ఆరోగ్యానికి పట్టిన తెగు లుగా అవతరించాయి. నేర చరిత్రలే రాజకీయ నాయ కుల అర్హతలు అయ్యాయి. భారత పార్లమెంటులో 50 శాతం వరకు ఎంపీలు నేర ఆరోపణలు కలిగి ఉండటం ఆందోళన కలిగించే అంశం. 40 మంది నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు నేరారోపణలు ఎదుర్కొంటు న్నట్లు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు 4,442 కేసులను ఎదుర్కొంటున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఏకమై ప్రజలు పోరుబాట పట్టాలి. నైతికత, పార దర్శకత, దేశభక్తి, చట్టాల పట్ల గౌరవం, జవాబుదారీ తనం, అంకితభావం పెరగాలి. నీతివంత మైన భారత నిర్మాణానికి అందరూ పూనుకోవాలి. అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతినబూనాలి.
(నేడు ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినం’)
– డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037