– తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
– జీ20 అధ్యక్షతంటే, ప్రజలే అధ్యక్షతే
– మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
చంద్రయాన్-3 మహిళా సాధికారతకు చిహ్నమని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం ప్రధాని మోడీ మన్ కీ బాత్ 104వ ఎపిసోడ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 భారత్ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భారత్ వచ్చే నెల ఢిల్లీలో జీ20 సమావేశాలకు సిద్ధమవుతోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్ ఈ స్థాయి జీ-20లో భాగస్వామి అవుతోందని, గ్రూపును మరింత కలుపుగోలుగా చేస్తోందని చెప్పారు. జీ-20కి భారత్ నేతృత్వమంటే, ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్టు భావించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
”భారత్ జీ-20 అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన పరిణామాలు చాలా చోటు చేసుకొన్నాయి. ఇప్పటి వరకు ఈ సదస్సులు జరిగిన నగరాల్లో ప్రజలు విదేశీ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. దేశంలోని వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూసి విదేశీ అతిథులు చాలా ప్రభావితమయ్యారు. దేశం చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలుసుకొన్నారు. జీ-20 సదస్సు శ్రీనగర్ లో జరిగిన తరువాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశం క్రీడల్లో నిలకడగా విజయాలు సాధిస్తోంది. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో రికార్డు స్థాయిలో మనవాళ్లు పతకాలు సాధించారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు దాదాపు 10 కోట్ల మంది జాతీయ పతాకంతో సెల్ఫీ దిగారు” అని అన్నారు.
”ప్రజలకు మాతృ భాషను బోధించడంలో భాగంగా జరిగే క్యాంపులో మీరూ పాల్గొనవచ్చు. అంతేకాదు.. తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘మేరీ మాటి.. మేరా దేశ్’ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. సెప్టెంబర్ నెలలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం నుంచి మట్టి నమూనా సేకరించే కార్యక్రమం ఉద్యమ స్థాయిలో జరుగుతుంది” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.