ఒకేషనల్‌ కోర్సు ప్రశ్నాపత్రంలో మార్పులు

–  ఇంటర్‌ బోర్డు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సు ప్రశ్నాపత్రంలో మార్పులు చేశామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2012-13 విద్యాసంవత్సరం కంటే ముందు ఉన్న ఇంగ్లీష్‌, జనరల్‌ ఫౌండేషన్‌ కోర్సు (జీఎఫ్‌సీ), ఆన్‌ ద జాబ్‌ ట్రైనింగ్‌ (ఓజేటీ) ఒకేషనల్‌ కోర్సు ప్రశ్నాపత్రంలో గరిష్ట మార్కులకు సంబంధించి మార్పులు చేశామని పేర్కొన్నారు. ఆ విద్యాసంవత్సరంలో చదివి ఇంకా బ్యాగ్‌లాగ్‌లు ఉన్న విద్యార్థులకు వచ్చే ఏడాది వార్షిక, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పాత విధానంలో రాసేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచి కొత్త విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంగ్లీష్‌కు 75 మార్కులుంటే కొత్తగా 50 మార్కులు, జీఎఫ్‌సీకి 75 మార్కులుంటే 50 మార్కులు, ఓజేటీకి 50 మార్కులుంటే, వంద మార్కులకు మార్పులు చేశామని వివరించారు.