గ్యాస్‌ సబ్సిడీకి కోత రూ.44,647 కోట్లు

– పెట్రోల్‌ రూ.63, కిరోసిన్‌ రూ.62.83 : కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి
న్యూఢిల్లీ : వంటగ్యాస్‌ ధర రూ.861 పెరిగిందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2004 ఏప్రిల్‌ 1 నాటికి గ్యాస్‌ ధర రూ.241.60 ఉంటే, 2021 ఫిబ్రవరి 4 నాటికి రూ.719 పెరిగిందనీ, ప్రస్తుతం (2023 మార్చి 1) రూ.1,103 పెరిగిందని అన్నారు. అలాగే పెట్రోల్‌ లీటర్‌ రూ.33.71 ఉంటే, రూ.96.72కి (రూ.63.01) పెరిగిందనీ, కిరోసిన్‌ లీటర్‌ రూ.9.26 ఉంటే, రూ.72.09 (రూ.62.83) పెరిగిందని తెలిపారు.
గ్యాస్‌ సబ్సిడీ కట్‌..
వంట గ్యాస్‌ సబ్సిడీ రూ.44,647 కోట్ల తగ్గించినట్లు కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. 2013-14లో గ్యాస్‌ సబ్సిడీ రూ.46,458 కోట్లు ఉంటే, దాన్ని 2021-22 నాటికి రూ.1,811 కోట్లకు తగ్గించినట్లు పేర్కొన్నారు.
నిరుద్యోగ రేటు 12.4 శాతం
దేశంలో యువతలో 12.4 శాతం నిరుద్యోగ రేటు నమోదు అయిందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22లో 15-29 ఏళ్ల మధ్య యువతి, యువకుల్లో 12.4 శాతం నిరుద్యోగం రేటు నమోదు అయిందని తెలిపారు.
మైనార్టీ బడ్జెట్‌ రూ.2,407 కోట్లు తగ్గింపు
2022-23 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి రూ.2,407.84 కోట్లు తగ్గించినట్లు కేంద్ర మైనార్టీ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022-23 బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి రూ.5,020.50 కోట్లు అంచనా వేశామని, అందులో రూ.2,612.66 కోట్లకు సవరించినట్లు తెలిపారు. గతేడాది బడ్జెట్‌లో సవరించిన బడ్జెట్‌ రూ.4,346.45 కోట్లు కాగా, ఈ ఏడాదిలో రూ.2,612.66 కోట్లకి తగ్గింది.
2026 తరువాతే నియోజకవర్గాల పునర్విభజన
2026 తరువాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారమే ఎంపి, ఎమ్మెల్యేల నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఎంపీ జివిఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నియోజకవర్గాల సరిహద్దుల రీడిజైనింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేదని పేర్కొన్నారు.