– జిల్లా కలెక్టర్ అమోరు కుమార్
– వేడుకలకు జిల్లా ప్రత్యేక అధికారిణిగా బోయి విజయేందిర
– కలెక్టర్, అధికారులతో ఆలయం, చెరువులు
పరిశీలించిన ప్రత్యేకాధికారిణి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భావితరాలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని ఈ విషయంలో అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా బుధవారం జిల్లా ప్రత్యేక అధికారిణి బోయి విజయేందిరతో కలిసి కలెక్టర్ అమోరు కుమార్, అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా స్థాయి అధికారులు శామీర్పేట్లోని కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం శామీర్పేట్ చెరువు, చీర్యాల్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జిల్లా ప్రత్యేక అధికారిణి విజయేందిర బోయి, జిల్లా కలెక్టర్ అమోరు కుమార్లకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కీసరలోని రైతువేదికను పరిశీలించి చేపట్టాల్సిన మరిన్ని పనులకు సంబంధించి సలహాలు, సూచనలు చేశారు.ఉత్సవాల్లో రైతు దినోత్సవాన్ని , సాగునీటి దినోత్సవాన్ని, ఊరూరా చెరువుల పండగతో పాటు ఇప్పటి వరకు ఏఏ పనులు చేశారన్న వివరాలను అడిగి తెలుసుకొని మరికొన్ని సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రత్యేక అధికారిణి బోయి విజయేందిరకు వివరిస్తూ ఉత్సవాలను ఘనంగా, పకడ్భందీగా నిర్వహించడానికి అధికారులతో పలుమార్లు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశాలు నిర్వహించామని వారికి పూర్తి స్థాయిలో దిశా నిర్ధేశం చేసినట్టు తెలిపారు. దీంతో పాటు ఆదివారం సైతం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో కార్యాచరణ ఆమోదించుకోవడంతో పాటు గ్రామ, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే కార్యక్రమాలపై అవగాహన తీసుకువచ్చి సిబ్బంది విధులు కేటాయిస్తూ ఆదేశాలు సైతం జారీ చేసినట్టు చెప్పారు. అలాగే ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా క్లస్టర్ పరిధిలో, గ్రామాల్లో చేపట్టబోయే రైతు దినోత్సవం, ఊరూరూ చెరువుల పండగలను ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే అధికారులను సమాయత్తం చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. దీంతో పాటు నోడల్ అధికారులు తమ శాఖ ఇచ్చే ఆదేశాలతో పాటు కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం 2014కు ముందు ప్రస్తుతం ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై నియోజకవర్గం వారీగా గ్రామ, మండలాల వారీగా నాడు నేడు పరిస్థితులను అద్దం పట్టే విధంగా అవసరమైన చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ఆదేశాలను జారీ చేసినట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు కరపత్రాలను సైతం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని లబ్దిదారుల విజయగాథలు, అభిప్రాయాలను నలుగురికి తెలిసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు.
జూన్ 7వ తేదీన బుధవారం ”సాగునీటి దినోత్సవంలో భాగంగా సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతీ నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేయాలని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే జూన్ 8న ”ఊరూరూ చెరువుల పండగ”నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కతిక ప్రదర్శనలు, గోరేటి వెంకన్న రచించిన చెరువు పాటలు సహా చెరువు మీద ఇతర కవులు రచించిన పాటలను పాడుతూ మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహించాలని చెరువు కట్టలపై సభలు నిర్వహించాలన్నారు. చెరువు కట్టలపై సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ఏర్పాటు చేయాలని అందుకు ఇప్పటి నుంచి అధికారులు ముందస్తు సన్నాహాలు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా గ్రామీణాభివద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, ఆర్డీవో రవి, ఇరిగేషన్ డీఈ సురేష్, జిల్లా వ్యవసాయాధికారిణి రేఖా మేరీ, ఉద్యాన శాఖ అధికారి నీరజ గాంధీ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.