ప్రజాస్వామ్య విధ్వంసం

ప్రజాస్వామ్య విధ్వంసం– బీజేపీ నియంతృత్వ విధానాలు ప్రమాదకరం.. : శరద్‌ పవార్‌
ముంబయి : బీజేపీ నియంతృత్వంతో వ్యవహరిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ధ్వజమెత్తారు. ఆదివారం బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన పూణెలోని సస్వాద్‌ తహసీల్‌లో నిర్వహించిన ప్రచారంలో శరద్‌ పవార్‌ మాట్లాడారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు గతంలో ఎన్నికల కంటే భిన్నంగా ఉన్నాయని, ఏ విధానంలో దేశం పనిచేస్తోందో తెలుస్తుందని అన్నారు.
” ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని కటకటాల వెనక్కి నెట్టారు. వారు (బీజేపీ) నియంతృత్వ మార్గంలో నడుస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం వారిని ఓడించాలి” అని దుయ్యబట్టారు. ఎన్‌సీపీ (ఎస్‌పీ) సిట్టింగ్‌ ఎంపీ, శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలెను బారామతి అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ భార్య సునేత్రా పవార్‌తో పోటీ పడుతున్నారు. సుప్రియా సూలేకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడతామని అన్నారు.