ముంబయి : పూర్తి స్థాయి డిజిటల్ ఇండియా ముసాయిదా బిల్లును జూన్ మొదటి వారంలో విడుదల చేస్తామని కేంద్ర సమాచార సాంకేతి శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సమాచార సాంకేతిక చట్టం-2000, అనంతరం చేసిన సవరణల తర్వాత ఇంటర్నెట్ను పాలిస్తున్న చట్టాలకు సంబంధించి ఇదే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోందని సూచనప్రాయంగా తెలియచేస్తూ, ఈ కేలండర్ సంవత్సరంలోనే కచ్చితంగా ఇది జరగనుందని చంద్రశేఖర్ తెలిపారు. ప్రాధమిక సూత్రాల ప్రాతిపదికన ఒక చట్రపరిధి వుంటుందని, దానిని అనుసరించి నిబంధనల ద్వారా నియంత్రించబడే చట్టం వుంటుందని మంత్రి పేర్కొన్నారు. వినియోగదారుడికి హాని కలిగించే కోణం నుండి చూస్తూ కృత్రిమ మేథస్సు (ఎఐ)ను ఎలా నియంత్రించాలన్నది కూడా ఈ ముసాయిదాలో వుండనుందని చెప్పారు. ఈ సాంకేతికతలకు ఎలాంటి హద్దులు లేవని చెప్పవచ్చు, ప్రస్తుత తరుణంలో తమ ఆలోచనా ధోరణి కూడా ఇదేనని చెప్పారు. ప్రస్తుతమున్న నిబంధనలు, నియంత్రణలను సంఘటితంగా, సూత్ర బద్ధమైన వ్యవస్థగా మార్చడం గురించి ప్రభుత్వం ఆలోచించడం బాగుందని పబ్లిక్ పాలసీ సంస్థ టిక్యుహెచ్ కన్సల్టింగ వ్యవస్థాపక భాగస్వామి రోహిత్ కుమార్ వ్యాఖ్యానించారు.