– ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వికలాంగుల పింఛన్ను రూ.4,016కు పెంచారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వికలాంగులు ప్రతి నెలా రూ.3,016 పింఛన్ను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా పెంపుతో వారు ఇక ప్రతి నెలా రూ.4,016 పింఛన్ను అందుకోబోతున్నారు. ఇటీవల మంచిర్యాల వేదికగా వికలాంగుల పింఛన్ను పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారంగా పెంపునకు సంబంధించిన ఫైల్ను ఆమోదించారు. ఈ క్రమంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.