నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న తెలంగాణ రైతాంగాన్ని తమ ఉత్పత్తులను విశ్వ విఫణిలో విక్రయించి మరిన్ని లాభాలు ఆర్జించే స్థాయికి చేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా, వరి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచ ప్రఖ్యాత రైస్ మిల్ కంపెనీ జపాన్కు చెందిన సటేక్ కార్పోరేషన్ ప్రతినిధులతో సోమవారం సచివాలయంలో సీఎం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌరసరఫరాలసంస్థ చైర్మెన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, సీఎస్ శాంతి కుమారి తదితర ఉన్నతాధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.
రైతులు పండించిన పంటకు లాభాలను ఆర్జించి పెట్టే మార్కెటింగ్ విధానాలను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో రైస్ మిల్లులను ఏర్పాటు చేయడం, నిర్వహించడం.. భవిష్యత్తులో వరి ధాన్యం నుంచి తయారు చేసే పలు రకాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను అనుసరించి మార్కెట్ను విస్తరించే బాధ్యత కూడా కార్పోరేషన్ చేపట్టడం, వంటి కీలక నిర్ణయాలను సీఎం తీసుకున్నారు. రైస్ మిల్లులకు అనుసంధానంగా రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అదే సందర్భంగా రోజు రోజుకూ పెరుగుతున్న ధాన్యపు నిల్వల కోసం మరిన్ని గోదాములను ఈ మిల్లులకు అనుసంధానంగా నిర్మిస్తారు. ఇంకా రైతులకు మేలు జరిగే దిశగా, ఇందుకు సంబంధించి మరిన్ని నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైస్ మిల్లుల స్థాపన నేపథ్యంలో సివిల్ సప్లైస్ కార్పోరేషన్లో మరిన్ని బాధ్యతలను చేపట్టే విధంగా అధికారులను, సిబ్బందిని పెంచుకోవాలని సీఎం ఆదేశించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” ఏ కారణం చేతనైనా పండిన పంట వ్యర్థం కాకుండా, తరుగు లేకుండా, రైతులకు ధర తగ్గడం వంటి నష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వున్నది. రైతు పంటకు ఓపెన్ మార్కెట్ రేట్ ధర పలికేలా చేయడానికి వరి ధాన్యాన్ని పలు రకాల ఉత్పత్తులుగా మార్చే దిశగా జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో గంటకు 60 టన్నులు, 120 టన్నులు బియ్యాన్ని ఆడించే అత్యంత ఆధునిక, సాంకేతికతో కూడిన రైస్ మిల్లులను ఏర్పాటు చేయనున్నాం” అని సీఎం కేసీఆర్ వివరించారు.
” మరికొద్ది రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలమూరు ఎత్తిపోతల, నల్గొండ జిల్లా బ్రాహ్మణవెల్లెంల, డిండి, సిద్దిపేటలోని గౌరవవెల్లి, ఖమ్మం జిల్లా సీతారామ, సిరిసిల్ల మల్కపేట, అచ్చంపేట ఉమామహేశ్వర వంటి ప్రాజెక్టులు పూర్తికానున్నాయి. అప్పుడు వరి ధాన్యం దిగుబడి రాష్ట్రంలో మరింతగా పెరుగనున్నది. అంచనాలకు మించి పెరుగుతున్న వరి ధాన్యపు మిల్లింగ్ సామర్థ్యాన్ని తదనుగుణంగా పెంచుకోవాల్సి ఉన్నది. ప్రస్తుతం సిఎంఆర్ మిల్లింగ్ ద్వారా రాష్ట్రంలో వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చే రైస్ మిల్లుల కెపాసిటి 75 లక్షల టన్నులకు మించి లేదు. దాంతో తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యం మిల్లుల్లో నిల్వలు పేరుకుపోతున్నాయి. అధిక నిల్వలతో తరువాత పంటకు నిల్వ స్థానం లేకుండా పోతున్నది. ధాన్యాన్ని మిల్లాడించే పరిస్థితి డిమాండ్కు తగ్గట్టు లేకపోవడం, పండిన పంటకు, రైస్ మిల్లుల సామర్థ్యానికి విపరీతమైన వ్యత్యాసం ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి రైతును గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.” అని సిఎం తెలిపారు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు కానున్న ఈ కార్యానికి ముఖ్య మంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.