ఆ ప్రచారం నమ్మొద్దు

– టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ ప్రభాకర్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ సంస్థల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పేరుతో కొందరు వ్యక్తులు నిరుద్యోగులను మోసం చేస్తున్నారనీ, అలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్లు లేవనీ, ఇటీవల తన పేరుతో మణుగూరులో ఓ వ్యక్తి నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చినట్టు తెలిసిందన్నారు. దీనిపై విజిలెన్స్‌ అధికారుల విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లపై తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారనీ, నిందితులు చట్ట ప్రకారం శిక్షింప బడతారని చెప్పారు. ఇలాంటి మోసాలకు గురైన వారు తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టాలని సూచించారు. ఏ ఉద్యోగం అయినా పరీక్షలు, అర్హతలు, ఇంటర్వ్యూల ఆధారంగానే వస్తాయని స్పష్టం చేశారు.