– అదేరోజు నోటిఫికేషన్ జారీ
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్, డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. అదేరోజు నోటిఫికేషన్ను విడుదల చేస్తారు. గురువారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఎడ్సెట్, పీఈసెట్ ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేశ్బాబు, ఎడ్సెట్ కన్వీనర్ ఎ రామకృష్ణ, పీఈసెట్ కన్వీనర్ రాజేష్కుమార్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వాటి కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈనెల 19న ఎడ్సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేస్తామని తెలిపారు. ఎడ్సెట్ ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, పరిశీలన, ఫీజు చెల్లింపునకు సంబంధించిన వివరాలను ఈనెల 20 నుంచి 30 నమోదు చేయాలని పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు స్కాన్ చేసిన వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కోరారు. ఎన్సీసీ, సీఏపీ, వికలాంగులు, క్రీడల అభ్యర్థులకు సంబంధించి భౌతికంగా ధ్రువపత్రాల పరిశీలన 25 నుంచి 29 వరకు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చేనెల మూడు నుంచి ఐదు వరకు వెబ్ఆప్షన్లను నమోదు చేయాలని పేర్కొన్నారు. ఆరున వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశముందని వివరించారు. తొమ్మిదిన మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. వచ్చేనెల పది నుంచి 13 వరకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. 30న తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. పీఈసెట్ ప్రవేశాలకు సంబంధించి 20 నుంచి 25 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, పరిశీలన, ఫీజు చెల్లింపు ఉంటుందని తెలిపారు. 24, 25 తేదీల్లో ఎన్సీసీ, సీఏపీ, వికలాంగులు, క్రీడల అభ్యర్థులకు భౌతికంగా ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో వెబ్ఆప్షన్లను నమోదు చేయాలని సూచించారు. 30న ఆప్షన్ల సవరణకు అవకాశముందని తెలిపారు. వచ్చేనెల మూడున మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు నాలుగు నుంచి ఏడు వరకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. వచ్చేనెల 30 నుంచి డీపీఈడీ, బీపీఈడీ తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.