ఇంజినీరింగ్‌ రెండోవిడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న రెండోవిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. 3,614 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్నారని తెలిపారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపునకు మంగళవారం వరకే గడువుందని పేర్కొన్నారు. 7,407 మంది వెబ్‌ఆప్షన్లు నమోదు చేశారని వివరించారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈనెల 26 వరకు, వెబ్‌ఆప్షన్ల నమోదుకు 27 వరకు గడువుందని తెలిపారు. ఇతర వివరాలకుhttps://tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.