హైదరాబాద్: దేశంలోని 600 పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చు కున్నామని ఎక్సెల్ఆర్ వ్యవస్థాపకుడు రామ్ తవ్వా తెలిపారు. ఎడ్టెక్ పరిశ్రమలోని తమ సంస్థ విద్యా రంగం, పరిశ్రమల మధ్య ఉన్న నైపుణ్య అంతరాన్ని పూరించటం ద్వారా విప్లవాత్మక మార్పుల కోసం కృషి చేస్తుందని రామ్ తవ్వా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను సరికొత్త సాంకేతికతలతో సన్నద్ధం చేయాలనే దృఢ సంకల్పంతో ఎక్సెల్ఆర్ డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక కోర్సులను ఇంజినీరింగ్ విద్యార్థుల పాఠ్యాంశాల్లోకి ప్రవేశపెట్టిందన్నారు. ఆయా పాఠ్యాంశాలను విద్యార్థులకు అందించడానికి పలు ఇన్స్ట్యూషన్లతో భాగస్వామ్యం అయ్యామన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సంస్థల ద్వారా విద్యార్థులకు, అధ్యాపకులకు ఎక్సెల్ఆర్ శిక్షణ అందిస్తుందన్నారు.