హైదరాబాద్ : మైండ్స్పేస్, స్లాన్ ఇంటర్ కార్పోరేట్ చెస్ టోర్నీ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. మాదాపూర్లోని మైండ్స్పేస్ బిజినెస్ పార్క్లో శుక్రవారం జరిగిన పోటీల్లో 100 మందికి పైగా ఐటీ ఉద్యోగులు పోటీపడ్డారు. ఐదు రౌండ్ల పోటీల అనంతరం హేమంత్ ఈశ్వర్ (క్యాప్జెమిని), కొరడ గురునాథ్ (టెలిపర్ఫార్మెన్స్), మనోజ్ కుమార్ (వెరిజన్) విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన ముగ్గురు ఈ నెల 25 నుంచి యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియంలో జరుగనున్న స్లాన్ బిలో 1600 చెస్ టోర్నమెంట్కు అర్హత సాధించారు. స్లాన్ స్పోర్ట్స్ సీఓఓ నవీన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.