– అస్సాం ఎస్ కె ఎం సమావేశంలో హన్నన్ మొల్లా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతు వ్యతిరేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుకు సిద్ధం కావాలని ఎఐకెఎస్ నేత హన్నన్ మొల్లా పిలుపు ఇచ్చారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ, పంటల బీమా వంటి సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మంగళవారం అస్సాంలోని గౌహతిలో ప్రగ్జ్యోతి కల్చరల్ ఆడిటోరియంలో రాష్ట్ర ఎస్ కె ఎం కన్వెన్షన్ జరిగింది. రాష్ట్రంలోని 10 రైతు సంఘాలు సంయుక్తంగా ఈ కన్వెన్షన్ ను నిర్వహించాయి. వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఉమ్మడి కిసాన్ సదస్సు జరిగింది. 10 మంది సభ్యులతో అధ్యక్ష వర్గం ఏర్పాటు చేశారు. బాలేంద్ర సైకియా ప్రధాన తీర్మానం చేశారు. ఎస్ కె ఎం సెంటర్ తరపున హన్నన్ మొల్లా కీలక ప్రసంగం చేశారు. ఎఐకెఎస్ (అజరు కుమార్) నేత అతుల్ కుమార్ అంజన్, ఎఐకెఎం నేత సుదామ ప్రసాద్ తో పాటు వివిధ సంఘాల నాయకులు మాట్లాడారు. ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ మద్దతు తెలిపారు. రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు హాజరై పోరాటానికి ఎస్ కె ఎం నిర్ణయాలను అస్సాంలో అమలుకు ఆమోదించారు.