అపరాజిత రాయ్… ఎనిమిదేండ్లకే తండ్రిని కోల్పోయింది. చిన్న వయసు నుంచే దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరు కావాలని నిర్ణయించుకుంది. పట్టుదలతో చదివింది. తన రెండు ప్రయత్నాలలోనూ ఉత్తీర్ణత సాధించింది. ఇప్పుడు సిక్కిం రాష్ట్రం నుండి మొదటి మహిళా ఐపీఎస్గా చరిత్ర సృష్టించించింది. శిక్షణ సమయంలోనే అకాడమీలో బెస్ట్ లేడీ అవుట్డోర్ ప్రొబేషనర్గా ట్రోఫీతో సహా అనేక అవార్డులు గెలుచుకున్న ఆమె విజయగాథ నేటి మానవిలో…
అపరాజితకు ఎనిమిదేండ్లు ఉన్నప్పుడు ఆయన మరణించారు. తల్లి రోమా రాయ్. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని చూస్తూ పెరిగిన ఆమె.. ఆ వ్యవస్థలో భాగం కావాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న రెండు దశాబ్దాల తర్వాత తొలి మహిళా ఐపీఎస్గా అవతరించింది.
యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 కోసం 11 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఖాళీలు 1105 మాత్రమే ఉన్నాయి. దరఖాస్తులు, ఖాళీల సంఖ్య ప్రతి ఏడాది దాదాపు ఒకే విధంగా ఉంటుంది. సాధారణంగా సివిల్స్ విజయాల వెనక ఎన్నో పోరాట కథలు దాగి ఉంటాయి. వాటిని చదివినపుడు ఎవరికైనా కంటతడి తప్పదు. అపరాజితది కూడా అలాంటి బాధాకరమైన జీవితమే. దృఢ సంకల్పం, పట్టుదలతో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిగా మంచి ర్యాంక్ను పొంది రాష్ట్రం నుండి మొదటి మహిళగా అవతరించింది. సివిల్ సర్వీసెస్ ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢమైన ఆశయంతో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) పరీక్షలో ఒక్కసారి కాదు రెండుసార్లు విజయం సాధించింది. ఆమె అచంచలమైన నిబద్ధత, అంకితభావానికి ఇది గొప్ప నిదర్శనం.
చిన్న వయసు నుండే
అపరాజిత తండ్రి జ్ఞానేంద్ర రాయ్. ఈయన సిక్కింలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. అయితే అపరాజితకు ఎనిమిదేండ్లు ఉన్నప్పుడు ఆయన మరణించారు. తల్లి రోమా రాయ్. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని చూస్తూ పెరిగిన ఆమె.. ఆ వ్యవస్థలో భాగం కావాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న రెండు దశాబ్దాల తర్వాత తొలి మహిళా ఐపీఎస్గా అవతరించింది. అపరాజిత చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకైనది. 2004లో జరిగిన ఐసీఎస్ బోర్డు పరీక్షలో 95 శాతం మార్కులతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పాఠశాల దశలోనే తాషి నామ్గ్యాల్ అకాడమీలో ఉత్తమ ఆల్ రౌండర్ విద్యార్థిగా ఫౌండర్స్ మెడల్ అందుకుంది. మాధ్యమిక తర్వాత, ఆమె నేషనల్ అడ్మిషన్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించింది. 2009లో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జ్యుడిషియల్ సైన్సెస్ నుంచి బి.ఎ, ఎల్.ఎల్.బి (ఆనర్స్) డిగ్రీని పొందింది. ఇక్కడ ఆమె న్యాయశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండింటిలోనూ బంగారు పతకాన్ని పొందింది. చిన్నతనం నుండి సివిల్ సర్వీస్లో ఉద్యోగం సంపాదించాలని కలలు కనేది.
మూడో ప్రయత్నంలో
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను తొలిసారిగా 2009లోనే ప్రయత్నించినా దానిని క్లియర్ చేయలేకపోయింది. అపరాజిత మరోసారి 2010లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైంది. ఈసారి 768వ ర్యాంక్ సాధించింది. అయితే దీంతో ఆమె సంతృప్తి చెందలేదు. 2011లో వరుసగా మూడోసారి యూపీఎస్సీ పరీక్షను రాసింది. ఈసారి ఆమె ఆల్ ఇండియా ర్యాంక్ 358వ స్థానంలో నిలిచింది. ఇలా మూడో ప్రయత్నంలో ఐపీఎస్గా అవతరించింది.
అనేక అవార్డులు
ప్రస్తుతం అపరాజిత సిక్కిం తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా రికార్డు కొట్టింది. ఆమె తన ఐపీఎస్ శిక్షణ సమయంలో పోలీసు అకాడమీలో అనేక అవార్డులను గెలుచుకుంది. వాటిలో బెస్ట్ లేడీ అవుట్డోర్ ప్రొబేషనర్గా 1958 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రోఫీ, ఫీల్డ్ కంబాట్ కోసం శ్రీ ఉమేష్ చంద్ర ట్రోఫీ, బెస్ట్ టర్న్ అవుట్ కోసం 55వ బ్యాచ్ సీనియర్ ఆఫీసర్స్ ట్రోఫీ, బెంగాలీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ట్రోఫీ సాధించింది. ప్రస్తుతం అపరాజిత పశ్చిమ బెంగాల్ కేడర్కు నాయకత్వం వహిస్తుంది.
అనేక కేసులను ఛేదించి
ఐపీఎస్ అపరాజిత డాషింగ్ పోలీస్ ఆఫీసరే కాదు మంచి క్రీడాకారిణి కూడా. అంటే కాకుండా డ్రగ్స్, బంగారం వంటి వస్తువులను స్మగ్లింగ్ చేసిన అనేక కేసులను ఛేదించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకసారి ఆమె కార్పొరేట్ తరహా స్మగ్లింగ్ సిండికేట్ను ఛేదించింది. కోల్కతా నుంచి సిలిగురికి వెళ్తున్న బస్సులో 8 కిలోల బంగారం, 74 కిలోల వెండి, సుమారు మూడు కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన క్రీడల కోసం అపరాజిత కొంత సమయం కేటాయిస్తుంది. ఆమె ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రన్నరప్గా కూడా నిలిచింది.
– మానవి డెస్క్