అడవుల రక్షణ, పునరుద్దరణే ప్రాధాన్యం


– ప్రత్యామ్నాయ అడవుల పెంపకం,

– రికార్డు స్థాయిలో కొత్త ఫారెస్ట్‌ బ్లాక్‌ల నోటిఫికేషన్‌
– బీడీ కార్మికులకు సేకరణ ఛార్జీలు, బోనస్‌ అన్‌ లైన్‌ ద్వారా నేరుగా ఖాతాలకు చెల్లింపు
– కోతుల బెడద నివారణకు స్టెరిలేజేషన్‌ సెంటర్లు పెంచుతాం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అడవుల రక్షణ, పునరుద్ధరణే తమ తొలి ప్రాధాన్యత అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నొక్కిచెప్పారు. ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీశాఖ పనితీరు, పురోగతిపై శనివారం హైదరాబాద్‌లో బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.బీడీ కార్మికులకు సేకరణ ఛార్జీలు, బోనస్‌ అన్‌లైన్‌ ద్వారా నేరుగా ఖాతాలకు చెల్లింపు ప్రక్రియను అధికారులతో కలిసి ప్రారంభించారు. సుమారు లక్ష మంది లబ్దిదారులకు 220 కోట్ల రూపాయల బోనస్‌ ను చెల్లించటం పట్ల మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు. హరితహారాన్ని విజయవంతం చేసి, గణనీయంగా పచ్చదన శాతం పెరిగేందుకు కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది, భాగస్వామ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కంపా నిధుల ద్వారా అడవులను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రాల్లో మనమే అగ్రస్థానంలో ఉన్నామని అన్నారు. కొత్తగా 135 అటవీ బ్లాక్‌లను అభివృద్ది చేస్తూ, సుమారు 14 వేల ఎకరాల అడవిని సృష్టించామని వివరించారు. ఆ అటవీ బ్లాక్‌ లను ప్రభుత్వం ద్వారా నోటిఫై కూడా చేయటం ఒక రికార్డు అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కోతుల బెడద అధికంగా ఉందనీ, రైతులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నిర్మల్‌లో నెలకొల్పిన స్టెరిలైజేషన్‌ సెంటర్‌ తరహాలో దశల వారీగా అన్ని జిల్లాలకు విస్తరించాలని సూచించారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ నుంచి గ్రామాల తరలింపు పురోగతి, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో టైగర్‌ కారిడార్ల విసృతిపై చర్చించారు. అటవీ నేరాల అదుపులో కఠినంగా ఉండాలనీ, అవసరమైతే పోలీసు శాఖతో సమస్వయం చేసుకుని పీడీ కేసులు పెట్టాలని సూచించారు. పెండింగ్‌ లో ఉన్న విజిలెన్స్‌ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. అటవీశాఖలో ఖాళీల భర్తీని టీఎస్‌పీఎస్‌తో సంప్రదింపుల ద్వారా త్వరగా రిక్రూట్‌ మెంట్‌ జరిగేలా చూడాలని ఆదేశించారు. వీలున్న అన్ని ప్రాంతాల్లో బాధ్యతాయుత ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని సూచించారు. జూన్‌ 19 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ హరితోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమీక్షలో పీసీసీఎఫ్‌, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌ ఆర్‌ఎం.డోబ్రియాల్‌, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎమ్‌డీ చంద్రశేఖరరెడ్డి, అటవీశాఖ జాయింట్‌ సెక్రటరీ ఎం. ప్రశాంతి, పీసీసీఎఫ్‌లు లోకేశ్‌ జైస్వాల్‌, ఎలూసింగ్‌ మేరు, ఎంసీ పర్గెయిన్‌, అదనపు పీసీసీఎఫ్‌ సునీతా భగవత్‌, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నాగేశ్వర రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.