– స్కంద ఏరోస్పేస్ తయారీ
– హైదరాబాద్లో యూనిట్ ప్రారంభం
హైదరాబాద్ : నగర కేంద్రంగా పని చేస్తోన్న రఘువంశీ మెషీన్ టూల్స్, అమెరికన్ సంస్థ రేవ్ గేర్స్ ఎల్ఎల్సీ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటైన స్కంద ఏరోస్పేస్ టెక్నాలజీ ప్రయివేటు లిమిటెడ్ (ఎస్ఎటిపిఎల్) తన అత్యాధునిక గేర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏరోస్పేస్-స్టాండర్డ్ గేర్లను తయారు చేసే ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పిఎ లాంచనంగా ప్రారంభించారు. ”స్కంద ప్రారంభోత్సవం భారత ఏరోస్పేస్, రక్షణ రంగ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, కీలకమైన రంగాలలో దేశం స్వావలంబనకు దోహదపడే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఏరోస్పేస్ సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశపు స్థిరమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. రక్షణ, విమానయాన రంగాల్లో దేశం పురోగతి సాధిస్తున్న తరుణంలో, స్కంద నుంచి వస్తున్న ఈ సరికొత్త, అధునాతన ప్లాంటు భారతదేశంలో, ప్రపంచ వేదికపై ఏరోస్పేస్ తయారీ భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందనే వాగ్దానాన్ని కలిగి ఉంది” అని రఘువంశీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ పేర్కొన్నారు.