అందమైన భాషలో, ముచ్చట పడుతూ చదివిస్తూ ఏదో జరుగుతుందని ఊహిస్తుంటే అనుకోని విధంగా ముగింపు ఇచ్చి అవాక్కయ్యేలా రాయడం బాల సాహితీవేత్త కె.వి. లక్ష్మణరావుకే చెల్లింది. ఈ రచయిత కథలన్నీ కూడా అమ్మ భాషలో ఆత్మీయంగా పలకరిస్తుంటాయి. చక్కని ప్రయోజనాన్ని పాఠకులు పొందుతారు.
ఈ రచయిత కలం నుంచి కొత్తగా వెలువడిన పుస్తకం టక్కరి మొసలి. ఈ పుస్తకంలోని 17 కథలు దేనికవే గొప్పగా ఉన్నాయి. కొన్ని కథలు సందేశాన్ని ఇవ్వగా, కొన్ని కథలు పాఠాలను నేర్పాయి. మరికొన్ని కథలు గుణపాఠాలను చెప్పాయి.
‘ఒక్కసారి ఆలోచించండి’ కథ మనల్ని అనేక సార్లు ఆలోచించేలా చేస్తుంది. సాధారణంగా ఇళ్లలో తిరిగే ఎలకల్ని బోనులో బంధించి చంపుతుంటారు. ఈ కథలో వినరు అలా చేయడం తప్పని ఎందుకు చెబుతాడో కథ చదివిన తర్వాత తెలుస్తుంది.
‘పసిడి మనసు’ కథలో చింటూ ఆదర్శంగా కనిపిస్తాడు. కరోనా వ్యాధితో బాధపడుతున్న పక్క ఇంటి వారి దరిదాపులకు వెళ్ళొద్దని అమ్మ చెప్పిన మాటలకు ఎంతో బాధపడతాడు. తల్లికి అర్ధమయ్యేలా ”అమ్మా కరోనా వ్యాధికి దూరంగా ఉండమన్నారు కానీ కరోనా వచ్చిన వారికి కాదు. వారికి దూరంగా ఉంటూనే అవసరమైన సేవలు, సహాయం చేస్తూ త్వరగా కోలుకునేలా చేయాలని” చెబుతాడు. నిజంగా ఇది ఒక్క చింటు తల్లికే కాదు, అలా ప్రవర్తించిన మిగతా వాళ్ళకు కూడా వర్తించేలా రాసిన కథ. ‘బురిడీ కొట్టిందిలే బుస్ బుస్ పాము’ కథలో తన పిల్లల్ని రక్షించుకోవడం కోసం కాకి ఆలోచించిన ఉపాయం నవ్వు తెప్పిస్తుంది. సమస్య నుండి పారిపోవడం కాకుండా సమస్యను దూరం చేయాలని బోధిస్తుందీ కథ. ‘చిట్టి చీమా నువ్వెక్కడీ’ చాలా మంచి కథ. మంత్రి పదవి కోసం ఆశపడే జంతువులను ఆశ్చర్యపరుస్తూ మృగరాజు ఆడిన నాటకమే ఈ కథ. మొసలి కన్నీరు కార్చిన మొసలికి గుణపాఠం చెప్పిన గోపీ సమయస్పూర్తిని తెలుపుతుంది టక్కరి మొసలి తెలివైన గోపి కథ. ఇలాంటి కథలు చదవడం వలన అపాయం నుండి ఉపాయంతో తప్పించుకోవాలని పిల్లలు ఆలోచిస్తారు.
మార్పు మంచిదే, గుణమే ప్రధానం మొదలైన కథలు పాఠకుల్ని అలరిస్తాయి. ఆనందింప చేస్తాయి. మిగతా కథలు చదివే పాఠకులు తప్పక ప్రయోజనాన్ని పొందుతారు. పుస్తకానికి వేసిన అందమైన ముఖచిత్రం, లోపలి చిత్రాలు కథలకు తగిన విధంగా అమరాయి.
టక్కరి మొసలి
రచన : కె.వి. లక్ష్మణరావు
పేజీలు : 44. వెల : 60/-
ప్రతులకు : నవ చేతన పబ్లిషింగ్ హౌస్ అన్ని బ్రాంచీలు.
– నారంశెట్టి ఉమామహేశ్వరరావు, 9490799203