నెలాఖరులోగా గ్రూప్‌-4 మెరిట్‌ జాబితా!

– టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు – తుది కీ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-4 రాతపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక తుది కీని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌ పీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్య దర్శి అనితా రామచంద్రన్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుది కీ టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. ప్రాథమిక ‘కీ’ని ఆగస్టు 28న విడుదల చేశామని పేర్కొన్నారు. దానిపై అదేనెల 30 నుంచి సెప్టెంబర్‌ నాలుగో తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంత రాలను స్వీకరించామని వివరించారు. వాటిని నిపుణుల కమిటీ పరిశీలించి తుది కీని రూపొందించిందని తెలిపారు. అయితే తుది కీపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించ బోమని స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూ: //షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెట్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష జులై ఒకటిన నిర్వహించిన విషయం తెలిసిందే. పేపర్‌-1కు 7,62,872 (80 శాతం) మంది, పేపర్‌-2కు 7,61,198 (80 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం గతేడాది డిసెంబర్‌ ఒకటిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గ్రూప్‌-4 మెరిట్‌ జాబితాను ఈనెలాఖరులోగా విడుదల చేసేందుకు టీఎస్‌పీస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.