– పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో….
– ఆరోగ్య మంత్రులతో కేంద్ర వైద్యారోగ్యశాఖ సమీక్ష
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ సకాలంలో అప్రమత్తం చేస్తే అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం మరింత వేగవంతమవుతుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు సూచించారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ అన్ని రాష్ట్రాల అరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షలో బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి హరీశ్ రావుతో పాటు ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా హరీశ్రావు మాట్లాడుతూ ప్రజారోగ్య సంరక్షణ కోసం ద్విముఖ వ్యూహం అనుసరించిందని తెలిపారు. ”మార్చి మొదటి వారంలో సమీక్ష నిర్వహించి, జిల్లాకు ఇద్దరు చొప్పున వైద్యాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వీరి ద్వారా సబ్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహా అన్ని ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ పూర్తి చేశాం. పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్, హాస్పిటల్ రెస్పాన్స్ వ్యవస్థలను సంసిద్ధంగా ఉంచాం. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవ గాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు అందుబాటు లో ఉంచడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశాం. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, భవన నిర్మాణ ప్రాంతాలు, ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో నీడ, నీటి వసతి ఉండేలా చర్యలు తీసుకున్నాం. వడ దెబ్బ తగిలిన పెద్దలు, చిన్నారులకు చికిత్స కోసం ప్రత్యేకంగా వార్డులు, ఐసీయూ బెడ్లు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశాం. తక్షణం వైద్య సహాయం అందేలా 108 అంబులెన్సు లో అవసరమైన మందులు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్, ఇతర మందులు అందుబాటులో ఉంచినట్టు ” మంత్రి హరీశ్ రావు వివరించారు.