హైదరాబాద్: ఎం.ఎస్ ధోని క్రికెట్ అకాడమి (ఎంస్డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 ట్రోఫీ మంగళవారం ఆవిష్కరించారు. ఎనిమిది జట్లు పోటీపడుతున్న స్కూల్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి ధోని తొలి కోచ్ కేశవ్ బెనర్జీ, హెచ్సీఏ స్కోరర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతిభావంతులైన వర్థమాన క్రికెటర్లను గుర్తించేందుకు స్కూల్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్టు ఎంఎస్డీసీఏ మార్కెటింగ్ డైరెక్టర్ రషీద్ బాషా తెలిపారు. లీగ్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పది మంది క్రికెటర్లకు పల్లవి ఫౌండేషన్ తరఫున రూ. 5 లక్షల ఉపకారవేతనం అందజేస్తామని, ధోని అకాడమిలో ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ అందజేస్తామని పల్లవి విద్యాసంస్థల సీఓఓ యశస్వి పేర్కొన్నారు. పల్లవి రాయల్స్, డీపీఎస్ వారియర్స్, ఎంఎస్డీసీఏ డామినేటర్స్, ఎంఎస్డీసీఏ స్ట్రయికర్స్, ఎంఎస్డీసీఏ ఫొనిక్స్, ఎంఎస్డీసీఏ స్కార్పియన్స్, ఎంస్డీసీఏ నైట్స్, ఎంఎస్డీసీఏ హరికేన్స్లు తొలి సీజన్లో పోటీపడుతున్నాయని 7హెచ్ స్పోర్ట్స్ డైరెక్టర్ బి.వెంకటేష్ తెలిపారు.