లోక్‌సభ పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

– సీట్లను కోల్పోవడం బాధాకరం
– రాజకీయాలకతీతంగా గళమెత్తాలి : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జనాభా ప్రాతిపదికన జరగనున్న లోక్‌సభ స్థానాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు, జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలంటూ దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేశారు. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్‌తో తక్కువ లోక్‌ సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరమని వాపోయారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభాను నియంత్రించని చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తమ ప్రగతిశీల విధానాల వల్ల శిక్షించబడుతున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేవలం జనాభా నియంత్రణ మాత్రమే కాకుండా అన్ని రకాల మానవాభివద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని, 18 శాతం జనాభా
కలిగిన ఆయా రాష్ట్రాలు 35శాతం జాతీయ స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయని వివరించారు. జాతీయ ఆర్థికాభివద్ధికి, దేశాభివద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న ఈ రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్‌సభ డిలిమిటేషన్‌ విధానంతో భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోకూడదని అభిప్రాయపడ్డారు. తమ ప్రగతిశీల విధానాలకు లబ్ధి పొందాల్సిన చోట తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న ఆయా రాష్ట్రాలు తమ వాణిని వినిపించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జరుగుతున్న అన్యాయంపై నాయకులు, ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చారు.