– వీఆర్ఏలకు సీఎం శుభాకాంక్షలు
– సూపర్ న్యూమరరీ పోస్టుల్లో 20,555 వీఆర్ఏలు
– జేఏసీ నేతలకు జీవో అందజేసిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సూపర్ న్యూమరీ పోస్టుల్లో వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు జీవో నెంబర్ 81ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ సోమవారం జారీ చేశారు. జీవో కాపీని సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా వీఆర్ఏ వ్యవస్థ కొనసాగిందన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని వివరించారు. తమ రాష్ట్రంలో కూడా వీఆర్ఏలు చాలా తక్కువ జీతంతోని పనిచేస్తున్నారని మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు తెలిపారన్నారు. వీఆర్ఏల క్రమబద్ధీకరణను వారంతా అభినందిస్తున్నారన్నారు. కొత్త ఉద్యోగాలు చేపట్టనున్న వీఆర్ఏలందరికీ సీఎం శుభాభినందనలు తెలిపారు. పదో తరగతి వరకు అర్హత కలిగిన వారు 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారనీ, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హౌదాతో, డిగ్రీ ఆపై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తారని స్పష్టం చేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ పోస్టులకు అప్రూవల్ ఇచ్చిందని తెలిపారు. 61 ఏండ్లు దాటిన 3,797 మంది వీఆర్ఏలకు వారు ఇంత కాలం సమాజానికి చేసిన సేవకు గాను, మానవీయ కోణంలో ఆలోచించి, వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్ తోనే మరో కేటగిరీలో వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని సీఎం స్పష్టం చేశారు. వీఆర్ఎల జేఏసీ ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్డర్ ఇస్తామనీ, ఈ ఆర్డర్లోనే ఆ విషయాలను పొందుపరిచామని తెలిపారు. ”వారు వారి పిల్లలను తీసుకొని వస్తే వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుంది. వీఆర్ఎ లు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు” అని సీఎం ప్రకటించారు. ఆయా శాఖల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చదివి ప్రమోషన్లు కూడా తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఉత్తర్వులిస్తే బాగుంటందని భావించి సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజే ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి చేశారన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా జీవోను రూపొందించినందుకు వారికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితోపాటు మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సీసీఎల్ఏ నవీన్మిట్టల్, ఉన్నతాధికారులు, వీఆర్ఏ జేఏసీ చైర్మెన్ రాజయ్య, కో చైర్మన్ రమేశ్ బహదూర్, సెక్రటరీ జనరల్ దాదేమియా, కో కన్వీనర్లు షేక్ రఫీ, వంగూరు రాములు, మాధవ నాయుడు, వెంకటేశ్ యాదవ్, గోవింద్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.