– రాజస్థాన్లో బీజేపీ నేత నయవంచన…
జోధ్పూర్: మాయ మాటలు నమ్మి వచ్చిన ఓ మహిళను ఓ బీజేపీ నేత వంచించాడు. ఆమె అవసరాన్ని అవకాశంగా తీసుకుని లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక అతని స్నేహితుడితో కూడా ఆమెపై అఘాయిత్యం చేయించాడు. జోధ్పూర్ జిల్లాలోని పాలి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వివరాల్లోకి వెళ్తే.. పాలీ ఏరియాకు చెందిన స్థానిక బీజేపీ నేత
మోహన్లాల్ జాట్.. ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ప్లాట్ ఇప్పిస్తానని మభ్యపెట్టి బాధిత మహిళను తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అక్కడికి వెళ్లిన ఆ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మహేశ్ చందక్ అనే అతని స్నేహితుడితో కూడా ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు.బాధితురాలిపై జరిగిన అఘాయిత్యానికి మోహన్ లాల్ జాట్కు సంబంధించిన మరో ఇద్దరు మహిళలు కూడా సహకరించడం గమనార్హం. బాధితురాలిపై అఘాయిత్యం చేయడమేగాక, ఆమె కుమార్తెను కూడా నిందితులు లైంగికంగా వేధించారు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు మోహన్లాల్ జాట్పైన, అతని స్నేహితుడు మహేశ్ చందక్పైన, సహకరించిన ఇద్దరు మహిళలపైన కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.