ఇడి సమన్లపై సుప్రీంకు జార్ఖండ్‌ సిఎం

రాంచీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్లపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. తనకు జారీ చేసిన సమన్లను ఉపసంహరించుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గతంలో ఇడిని ముఖ్యమంత్రి హెచ్చరించిన సంగతి తెలసిందే. జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌ జిల్లాలో అక్రమ మైనింగ్‌ కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై హేమంత్‌ సోరెన్‌ విచారణకు హాజరుకావాలని ఇడి గత నెలలో సమన్లు జారీ చేసింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఒక గిరిజన నేతను కేసు పేరుతో వేధించేందుకు కేంద్రం పెద్ద కుట్ర పన్నిందని సోరెన్‌ మండిపడ్డారు. గతేడాది నవంబర్‌లో విచారణకు హాజరుకావాలని ఇడి సమన్లు జారీ చేయగా, ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఓ వేడుకలో పాల్గొనేందుకు ఆయన ఛత్తీస్‌గఢ్‌ వెళ్లారు. 2020లో తన తండ్రి శిబుసోరెన్‌పై లోక్‌పాల్‌ ఆదేశాలకు అనుగుణంగా చేపట్టిన విచారణలో తన స్థిర, ఆస్తుల వివరాలను సిబిఐకు అందజేశానని సోరెన్‌ గుర్తు చేశారు. ఇడి ఆయా వివరాలను సిబిఐ నుంచి పొందవచ్చునని పేర్కొన్నారు.