మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 24న సంయుక్త సదస్సు

–  ఎస్‌ కెఎం, కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి పోరాటాలకు కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చాల ఉమ్మడి వేదిక సిద్ధమైంది. ఆగస్టు 24న న్యూఢిల్లీలో జాయింట్‌ కన్వెన్షన్‌ నిర్వహించినున్న ట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం కేంద్ర కార్మిక సంఘాల నేతలు, సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు సమావేశం అయ్యారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఉమ్మడిగా పోరాడాలన్న తమ నిర్ణయాన్ని సమావేశం పునరుద్ఘాటించింది. ఆయా సంఘాల పిలుపులకు బేషరతు మద్దతు, సంఘీభావంతో పాటు ఉమ్మడి పోరాటాల పరంపర చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా 24న జరిగే ఉమ్మడి సదస్సులో భవి ష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని నేతలు తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్‌ కౌర్‌, ఎఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ దావలే, విజూ కృష్ణన్‌, ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా, కార్మిక సంఘం నేత హర్బజన్‌ సింగ్‌, రైతు నేత సత్యవాన్‌ పాల్గొన్నారు.
మహిళా సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేస్తాం : మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహిళా హక్కులు, వారి సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అఖిలభారత ప్రజా తంత్ర మహిళా సంఘం ( ఐద్వా) జాతీయ నాయకులు ఎస్‌ పుణ్యవతి, రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మంగళ, బుధవారాల్లో హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో సంఘం అధ్యక్షురాలు ఆర్‌ అరుణజ్యోతి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాల వల్ల మహిళలపై దాడులు, హింస పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టించేందుకే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొస్తున్నారని గుర్తు చేశారు. దీనిపై లా కమిషన్‌కు తమ అభిప్రాయాలు తెలియజేశామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధి హామీ కార్మికులు, స్వయం సహాయక గ్రూపులు, ఇండ్ల స్థలాల సమస్యలు, వేధింపులు, రేషన్‌ కార్డుల సమస్యలపై ఆందోళనలు చేశామనీ, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.