సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
రెజ్లర్లకు మద్దతుగా మోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మహిళా రెజ్లర్లపై లైంగిక దాడి చేసిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరత్ సింగ్పై చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాల ని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చే శారు. ఢిల్లీలో రెజ్లర్ల చేస్తున్న న్యాయ పోరానికి సంఘీభావం తెలుపుతూ గురువారం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను కాటేదాన్ చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకూ మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు బీజేపీ ఎంపీ లైంగిక దాడులకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్లు, మల్ల యుద్ధం, కుస్తీ పైల్వాన్లు పేర్లతో పిలిచే వారు తమ ప్రాణాలను అడ్డుపెట్టి దేశం కోసం పోరాడి పతకాలు సాధించిన గొప్ప వీరులని కొనియాడారు. మోడీ ఎంతో గొప్పగా వారిని సన్మానించి ప్రచారం చేసుకున్నారని, వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఎంపీ బ్రిజ్ భూషణ్ శరత్ సింగ్పై చర్యలు తీసుకోకుండా ఉండడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని శాంతియుతంగా రెజ్లర్ల నిరసన కార్యక్రమాలు తెలుపుతు న్నా మోడీ ప్రభుత్వం వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఎంపీపై చర్యలు తీసుకుని, రెజ్లర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, అధ్యక్షులు రాజు, కోశాధికారి కవిత, ఉపాధ్యక్షులు రుద్రకుమార్, కిషన్, జిల్లా సహాయ కార్యదర్శి రామ్మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.