మహిళలను దూషించిన కర్ణాటక బీజేపీ ఎంపీ

బెంగళూరు : మహిళా దినోత్సవం రోజున ఓ మహిళపై కర్ణాటక బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బొట్టు పెట్టుకోలేదంటూ ఓ మహిళను దూషించారు. వివరాల్లోకి వెళితే.. కర్నాటక బీజేపీ నేత ఎస్‌ మునిస్వామి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోలార్‌లో మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా సేల్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. ఒక దుకాణం వద్ద వస్తువులను విక్రయిస్తున్న మహిళ నుదిటిపై బొట్టు లేకపోవడంతో ఎంపీ బహిరంగంగా తిట్టారు. ‘మొదట బొట్టు పెట్టుకోండి.. మీ భర్త బతికే ఉన్నాడు కదా..? మీకు ఇంగితజ్ఞానం లేదు’ అంటూ నానా దుర్భాషలాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ సంస్కృతి ఏంటో, మహిళలను అది ఎంత చులకనగా చూస్తుందో ఈ ఘటనను బట్టి స్పష్టమవుతోందని ఆ పార్టీ విమర్శించింది.