కేసీఆర్‌ డిశ్చార్జి

Former CM– నందినగర్‌లోని సొంతింటికి మాజీ సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వారం రోజుల చికిత్స అనంతరం బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారిపడటంతో కేసీఆర్‌ ఎడమ తుంటి భాగంలో తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఆయన్ను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆస్పత్రిలో కోలుకుంటున్న కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు.డిశ్చార్జి అనంతరం హైదరాబాద్‌ నందినగర్‌లోని సొంతింటికి చేరుకున్న కేసీఆర్‌కు సాంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి, హారతితో స్వాగతం పలికారు.చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్‌ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు.