– నియోజకవర్గానికి బీఆర్ఎస్ చేసిందేంటి?
– ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేదు
– విజయభేరి సభకు భారీగా తరలిరండి : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
– కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్న బీఆర్ఎస్ నేతలు ఐదేండ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్పేట్, దౌల్తాబాద్ మండలాలకు చెందిన పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కొడంగల్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్… నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తన హయాంలో తీసుకొచ్చిన ఏ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టారనీ, బొమ్రాస్పేట్, దౌల్తాబాద్ మండలాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. వికారాబాద్-తాండూర్ రైల్వే లైన్కు ఇప్పటికీ మోక్షం లభించలేదని ఎద్దేవా చేశారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి మాట అటుంచితే నియోజకవర్గాన్ని రెండు ముక్కలు చేసి రెండు జిల్లాల్లో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, చిన్న ప్రాంతాలను రెవెన్యూ డివిజన్లుగా మార్చిన ప్రభుత్వం…కొడంగల్ను ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే బీఆర్ఎస్ నేతలను కొడంగల్కు ఏం చేశారో నిలదీయాలన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ నియోజకవర్గాకే ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేసుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కేవలం ఆ మూడు నియోజకవర్గాలకే సీఎం, మంత్రులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కొడంగల్ రాష్ట్రంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. కొడంగల్గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలనీ, అప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే గౌరవం కొడంగల్కు దక్కిందని చెప్పారు. ఈనెల 17న సోనియాగాంధీ తుక్కుగూడ రాజీవ్గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరిలో ఐదు గ్యారంటీలను ప్రకటించనున్నదని తెలిపారు. విజయభేరి సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.