– భారీ జనసమీకరణకు కసరత్తు
– తెలంగాణ మోడల్ గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం
– ”మహా”గ్రామాలకు 20 ప్రచార రథాలు, 10 ఎల్ ఈడీ వీడియో స్క్రీన్ వాహనాలు
– ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న సభను బీఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాందార్ లోహ సభ సక్సెస్కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీయూసీ చైర్మెన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డిఆధ్వర్యంలో పలువురు ప్రజా ప్రతినిధులు కాందార్ లోహలోనే మకాం వేసి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ జనసమీకరణ చేసేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దేశ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న తెలంగాణ మోడల్ గురించి ప్రజల్లో విస్తత ప్రచారం చేపట్టడం ద్వారా కాందార్ లోహ సభకు భారీ జన సమీకరణ చేయాలనే లక్ష్యంతో పలు గ్రామాలకు 20 ప్రచార రథాలు, 10 ఎల్ ఈడీ వీడియో స్క్రీన్ వాహనాలను సోమవారం జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రచార రధాల ద్వారా తెలంగాణ కు సంబంధించి కోటి ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుఏడాదికి ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలు అప్పుపాలుకాకుండా ఆదుకుంటున్న రైతు బంధు పథకం , ఏ కారణం చేతనైన రైతు మరణిస్తే ఎలాంటి షరతులు లేకుండా 48 గంటల లోపు ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున అందించే రైతుబీమా పథకం, 24 గంటల ఉచిత కరెంట్ తో పంటనష్టం జరగకుండా రైతు ముఖంలో సంతోషం చూడటం, ఖరీఫ్, రబీ సీజన్ ఏదైనా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం వంటి రైతు సంక్షేమ పథకాల గురించి ఈ ప్రచారరథాల ద్వారా మహారాష్ట్ర ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు. కాందార్ లోహా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మోడల్ గురించి మహారాష్ట్ర ప్రజలకు పూస గుచ్చినట్టు వివరిస్తారని ఆయన చెప్పారు. బీఆర్ ఎస్ కాందార్ లోహా సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పే గొప్ప చరిత్ర గా మిగిలిపోతుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, ప్రవీణ్ పవాడీ, అంకిత్ యాదవ్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.