ప్రజల్లో ఉందాం.. ఫైట్‌ చేద్దాం…

ప్రజల్లో ఉందాం.. ఫైట్‌ చేద్దాం...– కార్యకర్తలకు కేసీఆర్‌ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసి ఎవరూ నిరుత్సాహపడొద్దు.. మరింత పట్టుదలతో పని చేసి, పార్టీని బలోపేతం చేద్దామంటూ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ప్రజల్లో ఉందాం..ఫైట్‌ చేద్దాం…’ అంటూ ఆయన వారికి దిశా నిర్దేశం చేశారు. గజ్వేల్‌కు దగ్గర్లోని ఎర్రవెల్లిలోగల కేసీఆర్‌ ఫాంహౌస్‌కు బుధవారం ఆయన స్వగ్రామమైన చింతమడక నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలొచ్చారు. వారందరూ కేసీఆర్‌ను చూడగానే ‘కేసీఆర్‌ జిందాబాద్‌.. జై తెలంగాణ.. జై కేసీఆర్‌…’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతోపాటు పలువురు నేతలు, ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.