విమోచన దినోత్సవం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే..

– కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ విమోచన దినోత్సవా (సెప్టెంబర్‌ 17)న్ని గత సంవత్సరం మాదిరిగానే సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘మేరీ మాటీ మేరా దేశ్‌ ‘ కార్యక్రమం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓవైసీకి భయపడే సీఎం కేసీఆర్‌ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరుపున అధికారికంగా నిర్వహించడం లేదని చెప్పారు. ఎన్నికల్లో గెలవక ముందు అధికారికంగా నిర్వహిస్తామంటూ ఆయన చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని విమర్శించారు. నైజాం నియంతృత్వం నుంచి విమోచనం జరిగిన రోజు ఉత్సవాలు జరుపుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభారు పటేల్‌ తెలంగాణ గడ్డపైనా జెండా ఎగురవేశారన్నారు. ఇప్పుడు 70 ఏళ్ల తరువాత తిరిగి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గత ఏడాది జెండా ఎగురేశారని గుర్తు చేశారు.