దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలకు లక్కీ డ్రా

Lucky draw for Dussehra Sankranti and Ugadi festivals–  ముందస్తు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే ప్రయాణికులకూ ప్రతి నెలా లక్కీ డ్రా : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌
– రాఖీ పండుగ లక్కీ డ్రాలో విజేతలకు నగదు పురస్కారాలు అందజేత
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా స్ఫూర్తితో ఇక నుంచి ప్రతి దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలకు లక్కీ డ్రాలు నిర్వహించి విజేతలను ఎంపిక చేసి వారిని సన్మానిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు నగదు పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. 33 మంది విజేతలకు సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్‌ నగదు పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాఖీ పండుగ సందర్భంగా మహిళల కోసం ఆగస్టు 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ప్రతి రీజియన్‌లో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ రూ.15 వేలు, తృతీయ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.50 లక్షలు అందజేసినట్టు చెప్పారు. లక్కీ డ్రాకు అనూహ్య స్పందన వచ్చిందని, దాదాపు 3 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఇందులో పాల్గొన్నారని చెప్పారు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని విజేతలను సన్మానించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. విజేతలలో గృహిణులు, ఉపాధ్యాయినీలు ఎక్కువగా ఉన్నారని, వారంతా 10 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ప్రయాణం చేస్తూ.. ఆర్టీసీ బస్సుతో అనుబంధం కలిగి ఉండటం హర్షణీయమన్నారు. రాఖీ పౌర్ణమి రోజు రికార్డు స్థాయిలో రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంత మొత్తం ఆదాయం రాలేదన్నారు. ఈ ఏడాది రాఖీ పండుగకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని, రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషితో పాటు అధికారుల పక్కా ప్రణాళిక వల్ల సంస్థకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందన్నారు. పండుగల రోజుల్లో సిబ్బంది త్యాగం చేస్తూ సేవలు అందిస్తున్నారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
బస్సుల్లో ముందస్తు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే ప్రయాణికులకూ ప్రతి నెలా లక్కీ డ్రా నిర్వహించాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. రెండేండ్లలో టీఎస్‌ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రయాణికులే కేంద్రంగా అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మరో 1000 బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ వరకు కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే 8 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా మహిళల కోసం మరో నాలుగు రూట్లలో (113 జెడ్‌/ఎం, 222ఏ, 9 ఎక్స్‌/272, 9 వై/ఎఫ్‌) లేడీస్‌ స్పెషల్‌ బస్సులను నడపాలని నిర్ణయించినట్టు తెలిపారు.
లక్కీ డ్రాలో గెలుపొంది నగదు పురస్కారాలు అందుకున్న మహిళా ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఆర్టీసీ బస్సుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. టీఎస్‌ఆర్టీసీ సేవల్ని ఎప్పటికీ మరచిపోలేమని కొనియాడారు. ప్రయివేటు వాహనాల్లో వెళ్లడం అంత సురక్షితం కాదంటూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం తమకు ఎంతో ఆనందాన్ని కల్గిస్తుందంటూ పలువురు విజేతలు తెలిపారు. ఈ లక్కీ డ్రాలో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన 7వ తరగతి విద్యార్థిని కె.ప్రాంజల్‌ ద్వితీయ నగదు బహుమతి గెలుపొందడం విశేషం. తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు గుడిహత్నూరకు బస్సులో ప్రయాణించిన ఆ బాలిక.. లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకుంది. చిన్నతనంలోనే నగదు పురస్కారం అందుకోవడం పట్ల ఆ బాలికను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీవోవో) డాక్టర్‌ వి.రవిందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్‌, వెంకటేశ్వర్లు, సీటీఎం జీవన ప్రసాద్‌, సీఈఐటీ రాజశేఖర్‌, సీఎఫ్‌ఎం విజయపుష్ప, రంగారెడ్డి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ఆర్‌ఎంలు శ్రీధర్‌, ఖుస్రోషా ఖాన్‌, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.