నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ న్యాయ శాస్త్ర కళాశాలలో మధ్యవర్తిత్వం – సవాళ్లు అనే అంశంపై గురువారం వర్క్ షాప్ నిర్వహించారు.ఈ సదస్సు కు ముఖ్య వక్తగా పాల్గొన్న ఐ ఐ ఏ ఎం మీడియేటరు కే. స్. శర్మ ప్రసంగిస్తూ న్యాయస్థానాలలో లిటిగేషన్ అనేది కాలాన్ని, ధనాన్ని వృధా చేస్తుందని మానవీయ సంబంధాలను దూరం చేస్తుందని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం సమస్యను పరిష్కరించి స్నేహపూరితమైన వాతావరణాన్ని నెలకొల్పుతోందని పేర్కొన్నారు. మంజీరా వెంకటేష్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వివిధ దశల గురించి సమగ్రంగా అవగాహన కల్పించినారు. మధ్యవర్తిత్వం ప్రధానంగా మానవ సంబంధాలను మెరుగుపరిచి మంచి సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. పంతాలు పట్టింపులు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయని అవి మధ్యవర్తిత్వంతోనే పరిష్కరించు కోవాలని సూచించారు. ఈ వర్క్ షాప్ కు న్యాయ కళాశాల ప్రిన్సిపాల్, విభాగాధిపతి డాక్టర్ కే ప్రసన్న రాణి అధ్యక్షత వహించారు. ప్రజా సంబంధాలను మెరుగుపరిచే మధ్యవర్తిత్వం అనే అంశం పై కార్య శాలను నిర్వహించినందుకు న్యాయ కళాశాల ఫ్యాకల్టీని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి అభినందించారు. న్యాయ కళాశాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా, డా. బి.స్రవంతి, డాక్టర్ నాగజ్యోతి, డా.రామలింగం, డా. నర్సయ్య, డా.ప్రవీణ్ వివిధ శాఖల విద్యార్థులు పాల్గొన్నారు.