– పీఆర్టీయూ తీర్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెలాఖరులో ఒక బృహత్తరమైన ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించాలని పీఆర్టీయూ తీర్మానించింది. శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.చెన్నయ్య అధ్యక్షతన వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. పదోన్నతులు, బదిలీలు, ఈహెచ్ఎస్ ఏర్పాటు, 2003 డీఎస్సీ వారికి ఓపీఎస్, సీపీఎస్ రద్దుపై కమిటీ, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, పీఆర్సీ కమిషన్, పెండింగ్ డీఏల విడుదల తదితర సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు నాయకులు గుర్తుచేశారు. 10న నేపాల్లో జరుగు ఏఐఎఫ్టీఓ సమావేశానికి సంఘం నుంచి ప్రాతినిధ్యం కోసం బయలు దేరుతున్నరాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి ,రాష్ట్ర నాయకురాలు గోలి పద్మకు సమావేశం శుభాకాంక్షలు తెలిపింది. జూలై మొదటి వారంలో పీఆర్టీయూ తెలంగాణ సంఘం శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలనీ, వాటికి ప్రతి జిల్లా నుంచి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఐదుగురు చొప్పున నిష్ణాతులైన ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని తీర్మానాన్ని ఆమోదించారు.