– ఏఐటీయూసీ నాయకులు జైపాల్రెడ్డి
నవతెలంగాణ-మియాపూర్
మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా నాయకులు జైపాల్ రెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఏఐటీయూసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని సంస్థలో పనిచేస్తున్నా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తుందని ఆశించినా ఫలితం లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులకు రూ.21 వేలు అమలు చేస్తుందనీ, ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్మికులు అనారోగ్యంతో మృతి చెందితే, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, దహన సంస్కరణలకు రూ.10 వేలు, రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాన్నారు. జాతీయ పండుగ రోజున సెలవులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికులను నియమించాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ మున్సిపల్ కార్మికుల నూతన కమిటీని ఏకగ్రీ వంగా ఎన్నికయింది. ఈ కమిటీలో అధ్యక్షులుగా పరమేష్, ప్రధాన కార్యదర్శిగా చందుయాదవ్, కోశాధికారిగా బాల రాజ్, కమిటీ సభ్యులుగా 20మందితో ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చందు యాదవ్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి టి.రామకృష్ణ, డిహెచ్పీఎస్ వెంకటస్వామి, మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి, ప్రజానాట్యమండలి నాయకులు సుధాకర్, కార్మికులు పాల్గొన్నారు.