బీజేపీకి నేతాజీ మనవడు రాజీనామా

– పార్టీ తప్పుడు మార్గంలో వెళుతుందంటూ విమర్శ
కోల్‌కతా : బీజేపీ తప్పుడు మార్గంలో వెళుతుందంటూ ఆ పార్టీకి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మనవడు చంద్రబోస్‌ బుధవారం రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో కలిసి పనిచేయలేనని తేల్చిచెప్పారు. పక్షపాతం, ఓటు బ్యాంక్‌, విద్వేష రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని విమర్శించారు. ఈ మేరకు బీజేపీ అధ్యక్షులు జెపి నడ్డాకు ఆయన లేఖ రాశారు. ‘పార్టీ ఎలా పని చేయాలో అనేకసార్లు ప్రతిపాదనలు ఇచ్చాను. కానీ అవి అంగీకరించబడలేదు. బెంగాల్‌లో పార్టీ తప్పుడు మార్గంలో వెళుతుంది. రాష్ట్రంలో పార్టీకి ఉన్న అవకాశాలు నాశనమయ్యాయి’ అని పేర్కొన్నారు. ‘నేను బీజేపీలో చేరినప్పుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, శరత్‌ చంద్రబోస్‌ల భావజాలాన్ని ప్రచారం చేయడానికి నన్ను అనుమతిస్తామని నాకు హామీ ఇచ్చారు. కానీ అలాంటిదేమీ జరగలేదు’ అని లేఖలో బోస్‌ విమర్శించారు. 2016లో బీజేపీలో చంద్రబోస్‌ చేరారు.