‘ఆధార్‌’ ఆధారిత చెల్లింపు వద్దు

– ఆర్బీఐ గవర్నర్‌కు బ్యాంక్‌ బచావో ఫోరమ్‌ లేఖ
– బ్యాంకు మోసాలపై ఆందోళన
న్యూఢిల్లీ : ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను వ్యతిరేకిస్తూ ‘బ్యాంక్‌ బచావో దేశ్‌ బచావో మంచ్‌’ స్పందించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు లేఖ రాసింది. ఈ చెల్లింపు వ్యవస్థ ద్వారా జరిగే బ్యాంకు మోసాలపై మంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ‘బ్యాంక్‌ బచావో దేశ్‌ బచావో మంచ్‌’ ఖాతాదారులకు ఆధార్‌ కార్డ్‌ మోసం నుంచి రక్షణ కల్పించాలని లేఖలో అభ్యర్థించింది. తగు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్‌ను కోరింది. ఆధార్‌ కార్డును ఉపయోగించి వినియోగదారుల వేలిముద్రలను అనుకరిస్తూ మోసగాళ్లు ఇప్పుడు బ్యాంకుల నుంచి డబ్బును దోచుకుంటున్నారు అని వివరించింది. అసోసియేషన్‌ జాయింట్‌ కన్వీనర్లు బిశ్వ రంజన్‌ రారు, సౌమ్య దత్తాలు లేఖ రాసినవారిలో ఉన్నారు.