నవతెలంగాణ-కొడంగల్
ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో గురువారం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. దీంతో కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ కాక ఆరంభమైంది. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి సీఎం కేసీఆర్ సమూచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చారు. అయితే ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తూ, ఆయన గెలుపునకు గురునాథ్రెడ్డి ప్రధాన భూమిక పోషించారు. కొంతకాలం కలిసి పనిచేసినా ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం ఆ పార్టీ నాయకులు పిలుపునివ్వడంతో ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ అలజడి ఆరంభమైంది. నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇమేజ్ సంపాదించుకున్న మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకోవడం, ఆ మేరకు టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కలవడం, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడం చకచక జరిగిపోయాయి. మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి అనుచర వర్గం బీఆర్ఎస్లోనే కొనసాగుతారా ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వెళ్లుతారా? లేదా అని నియోజక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గురునాథ్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో రేవంత్ రెడ్డి సునయాసంగా గెలుస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ, అనేక సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తాయని ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో చర్చలు జోరుగా సాగుతున్నాయి.