జూన్‌ 3న కోర్టు క్యాంటీన్‌ ప్రారంభం

నిర్ణయించిన బార్‌ అసోసియేషన్‌
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్‌
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మాణం చివరి దశలో ఉన్న న్యాయవాదుల క్యాంటీన్‌ను జూన్‌ 3వ తేదీన ప్రారంభించాలని బార్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తీర్మానించింది. శుక్రవారం బార్‌ అసోసియేషన్‌ లైబ్రరీ హాలులో రమేష్‌ కుమార్‌ మక్కడ్‌ అధ్యక్షతన జరిగిన బార్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో క్యాంటీన్‌ విషయమై పలు నిర్ణయాలు చేశారు. క్యాంటిన్‌ నిర్వహించటానికి ముందుకు వచ్ఛే వారి వద్ద నుండి, క్యాంటీన్‌ ధరావత్తు, నెలవారీ నిర్వహణా ఖర్చులు, ధరల పట్టిక, తదితర వివరాలు సీల్డ్‌ కవర్లలో ప్రతిపాదనలను ఈ నెల 20 నుండి 23 వరకు ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. క్యాంటీన్‌ నిర్వహణ ప్రతిపాదనల నమూనా బార్‌ అసోసియెషన్‌ కోశాధికారి సాహు సంతోష్‌ లాల్‌ నుంచి పొందవచ్చునని రమేష్‌ కుమార్‌ మక్కడ్‌ తెలిపారు. ఈ సమావేశంలో కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రావిలాల రామారావు, ఉపాధ్యక్షుడు దుండ్ర రమేష్‌, సంయుక్త కార్యదర్శి కాసాని రమేష్‌, కోశాధికారి సాహు సంతోష్‌ లాల్‌, క్రీడా కార్యదర్శి పిట్టల రామారావు, గ్రంథాలయ కార్యదర్శి యాసా యుగంధర్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు జివి. హరిప్రసాద్‌, జికె.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.