కాంగ్రెస్‌ భయంతోనే ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’

– బీజేపీ సర్కారుపై చామల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీకి కాంగ్రెస్‌ భయం పట్టుకుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. అందుకే వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ అంటూ కొత్త రాగం ఎత్తుకుందని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ప్రస్తావన వెనుక బీజేపీ భయమే కారణమని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ఓటమి ఖాయమన్నారు.
పెరికెలకు నాలుగు సీట్లు ఇవ్వండి
మహేష్‌కుమార్‌గౌడ్‌కు ముత్తినేని వీరయ్య వినతి
సామాజిక న్యాయం దిశగా అడుగులేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ…రానున్న ఎన్నికల్లో పెరికెలకు నాలుగు సీట్లు (మిర్యాలగూడ, మంచిర్యాల, వరంగల్‌ తూర్పు, పరకాల) కేటాయించాలని పెరికకుల కార్పొరేషన్‌ సాధన కమిటీ చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య కోరారు. ఈమేరకు శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యెండి రవీందర్‌, బరపతి రవిరాజ్‌, ముత్త్తె సత్తెయ్య, అక్కల తిరుపతి వర్మ, బుద్దె పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.