– సెక్టోరియల్ అధికారులకు మెజిస్ట్రీయల్ పవర్స్
– స్టిక్కర్ రూపంలో ఓటరు సమాచారం
– నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు దృష్టి సారించారు. ఎక్కడ చిన్నపొరపాటు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను ఎలా పూర్తిచేయాలో ఇప్పటికే సెక్టోరియల్ అధికారులకు శిక్షణ అందించారు. పది నుంచి 12 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టోరియల్ అధికారిని నియమించారు. సెక్టోరియల్ అధికారులు జిల్లా మిషనరి, ఆర్.ఓ, పోలింగ్ బూత్ సిబ్బందికి వారథి లాగా పనిచేస్తారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య తలెత్తినా సెక్టోరియల్ అధికారులే పరిష్కరించాలి. తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ను కనీసం మూడు సార్లు సందర్శించి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏ.ఎం.ఎఫ్ (కనీస అవసరాల) పరిశీలించాల్సి ఉంటుంది. దివ్యాంగుల కోసం ర్యాంప్ ఏర్పాటుతోపాటు, ఓటర్లకు తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, ఇంటర్నెట్, సాకెట్స్, మరుగుదోడ్లు తదితర సౌకర్యాలు ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలి. తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తారో పూర్తి సమాచారం సెక్టోరియల్ అధికారుల వద్ద ఉండాలి. పోలింగ్కు వారం రోజుల ముందు నుంచి సెక్టోరియల్ అధికారులకు మెజిస్ట్రీయల్ పవర్స్ను కల్పించారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా లేదా ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించినా చర్యలు తీసుకుంటారు.
నవంబర్ 10 తర్వాత బీఎల్.ఓలు ఓటరు స్లిప్లను పంపిణీ చేయనున్నారు. ఈసారి కొత్తగా ఓటరు సంబంధిత సమాచారాన్ని స్టిక్కర్స్ రూపంలో ప్రతి ఇంటికీ అతికించనున్నారు. ఈవీఎం, వి.వి ప్యాట్ రీప్లేస్మెంట్, ఓటరు నమోదు శాతం, రిపోర్ట్లపై పనిచేయాలి.
ఈవీఎంల పనితీరుపై ప్రిసైడింగ్ అధికారులు సెక్టోరియల్ అధికారులకు సమాచారం అందింస్తారు. సిబ్బందికి పోలింగ్ రోజు ముందుగా మాక్ పోల్ నిర్వహించాల్సి వుంటుంది. ఈవీఎం, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లో ఏదైన సమస్య వచ్చినా సంబంధిత సామాగ్రిని మార్చేందుకు అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు.