నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓపెన్ ఇంటర్ ఆర్థిక శాస్త్రం (తెలుగు మాధ్యమం) పరీక్షను ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ డీఈవో ఆర్.రోహిణి, ఓపెన్ స్కూల్ జిల్లా కో-ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు ఈ సమాచారాన్ని ఏఐ కో-ఆర్డినేటర్ల ద్వారా విద్యార్థులకు చేరవేయాలని వారు కోరారు. మే 2న జరగాల్సిన ఓపెన్ స్కూల్ ఇంటర్ ఎకనామిక్స్ పరీక్షకు సంబంధించి తెలుగు మీడియం ప్రశ్నపత్రాలకు బదులుగా ఇంగ్లీష్ మీడియం పేపర్లను పరీక్ష కేంద్రాలకు అధికారులు పంపారు. పరీక్ష కేంద్రాల్లో చివరి నిమిషంలో ఇన్విజిలేటర్లు గుర్తించడంతో సదరు పరీక్షను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను 13న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇది వరకు జరిగిన పరీక్ష కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 12 నుంచి 19 వరకు జరుగుతాయని తెలిపారు.