యూసీసీ అమలు దేశ వైవిద్యంపై దాడి : ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు దేశ బహుళత్వం, వైవిధ్యంపై దాడి చేయడమేనని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. దేశంలో యూసీసీని అమలు చేయాలని, కానీ ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నట్టు ప్రధాని మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. భోపాల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. హిందూ మతంలో ముందుగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలనీ, దేశంలోని ప్రతి ఆలయంలో ఎస్‌టీలు, ఎస్‌సీలు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని డీఎంకే నేత టీకేఎస్‌ ఇళంగోవన్‌ సూచించారు. యూసీసీ తమకు అవసరం లేదని, ఎందుకంటే రాజ్యాంగం ప్రతి మతానికి రక్షణ కల్పించిందని అన్నారు. ప్రధాని మొదట దేశంలో పెరుగుతున్న పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగంపై స్పందించాల్సి వుందని కాంగ్రెస్‌ నేత కెసి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఒకవైపు మణిపూర్‌ మండిపోతోందనీ, కానీ ప్రధాని మణిపూర్‌ అంశంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ అనేది ఇస్లాంలో విడదీయరాదని భాగమైతే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, ఇండోనేషియా, ఖతర్‌, జోర్డాన్‌, సిరియా వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.
ఉమ్మడి పౌరస్మృతిపై ముస్లిం వర్గాన్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. ప్రజలకు రెండు రకాల రూల్స్‌ ఉంటే ఒక కుటుంబం ఎలా పనిచేస్తుందని, అప్పుడు దేశం ఎలా పనిచేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఉమ్మడి పౌరస్మృతి కావాలంటే దాన్ని పార్లమెంట్‌లో బీజేపీ ప్రవేశపెట్టవచ్చనీ, వాళ్లను ఎవరు అడ్డుకున్నారని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో యూసీసీ ప్రవేశపెట్టకుండా, ప్రతిపక్షాలపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. భారత్‌లో ఉన్న బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని ప్రధాని మోడీ సమస్యగా చూస్తున్నారని, యూసీసీ పేరుతో దేశ ఔనత్యాన్ని తగ్గిస్తారా అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసి మండిపడ్డారు.