మా పోరాటం ఆగదు

Our fight will not stop– గృహ నిర్బంధంలో నేతలు
– సుప్రీం తీర్పుపై జమ్ముకాశ్మీర్‌ పార్టీల నిర్వేదం !
న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జమ్ము కాశ్మీర్‌కు చెందిన రాజకీయ పార్టీలు ఆచితూచి స్పందించాయి. జరగాల్సిన చర్య జరిగిపోయినందున ఇక న్యాయ వ్యవస్థ ఇచ్చే ఆమోదముద్ర కేవలం లాంఛనప్రాయమేనన్న అభిప్రాయంలో ఆయా పార్టీలు వున్నాయి. శ్రీనగర్‌కి చెందిన ఒక వ్యాపారవేత్త వైర్‌తో మాట్లాడుతూ, ఈ నిర్ణయాన్ని కాశ్మీరీలు చాలామంది ముందుగానే ఊహించారని చెప్పారు. ఇంతకన్నా భిన్నమైన తీర్పు వస్తుందని వారు ఊహించలేదన్నారు. దీన్ని మనం మార్చగలిగేది కూడా ఏమీ లేదనే అభిప్రాయంతో వారున్నారని అన్నారు. కాగా తీర్పు వెల్లడించడానికి ముందుగానే కాశ్మీర్‌ వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాజకీయ పార్టీల నేతలను ఇంటి నుండి బయటకు కదలనివ్వకుండా గృహ నిర్బంధం చేశారు. మీడియా వారితో కూడా మాట్లాడనివ్వలేదని వారు విమర్శించారు.
మన నష్టం కంటే కూడా…
మన నష్టం కంటే కూడా భారతదేశం యొక్క ఆలోచన ఈనాడు ఓటమిని చవిచూసిందని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలు (పీడీపీ) మెహబూబా ముఫ్తి విమర్శించారు. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో తీసుకున్న చట్టవిరుద్ధమైన నిర్ణయం, ఈనాడు సుప్రీంకోర్టు దానికి ఆమోద ముద్ర వేయడం చూస్తుంటే భారతదేశపు ఆలోచనకు మరణ శిక్ష విధించినట్లయిందని ఆమె పేర్కొన్నారు. ఆ ద్రోహమనేది వారి నుంచే వచ్చింది, మన నుంచి కాదని అన్నారు. 370వ అధికరణను తాత్కాలిక నిబంధన అని పేర్కొనడం ద్వారా దేశాన్ని బలహీనపరిచారు.
నిరాశ కలిగింది
సోమవారం ఉదయం నుంచి తాను గృహ నిర్బంధంలో వున్నట్టు మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. తన ఇంటి గేటుకు తాళం వేశారని, మీడియా వారిని తనతో మాట్లాడనివ్వలేదని చెప్పారు. న్యాయం జరుగుతుందనే ఆశతో సుప్రీం తలుపుతు తట్టాం, కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. ‘మేం విఫలమయి వుండవచ్చు, నిర్ణయం నిరాశను కలిగించవచ్చు.
కానీ ఇదంతా తాత్కాలిక మైన ఎదురు దెబ్బే, మాది రాజకీయ పోరాటం, చట్టపరిధుల్లోనే మా పోరాటం కొనసాగుతుంది.” అని చెప్పారు. తనను ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించలేదని సీపీఐ(ఎం) నేత ఎం.వై.తరిగామి అన్నారు. మీడియా వారిని కూడా రానివ్వలేదన్నారు.
సంతోషంగా లేరు
ఈ తీర్పుతో జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు సంతోషంగా లేరని మాజీ కాంగ్రెస్‌ నేత గులాం నబీ అజాద్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టే మా చివరి ఆశ, ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35-ఎలు జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన చారిత్రక అంశాలు. కోర్టు నిర్ణయం మమ్మల్ని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెప్పారు. ఈ తీర్పు పట్ల పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు సజద్‌ లోనె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుప్రీం రూలింగ్‌ని ఆమోదించి, ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిందిగా జమ్ము కాశ్మీర్‌ చివరి డోగ్రా పాలకుడు మహారాజా హరిసింగ్‌ మనవడు కరణ్‌ సింగ్‌ ప్రజలను కోరారు.
గృహ నిర్బంధాలు లేవు
ఎవరినీ గృహ నిర్బంధంలో వుంచలేదని జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తెలిపారు. ముఫ్తి, అబ్దులాలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతో ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. పుకార్లను వ్యాప్తి చేస్తున్నారన్నారు.