మీ భూములను దున్నుకోండి

– ఎవరు అడ్డొచ్చినా ఎదురు తిరగండి
– రైతులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది
– ఆర్నెల్లలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇప్పిస్తాం
– బహుళజాతి కంపెనీల ప్రతినిధిలా మంత్రి కేటీఆర్‌ : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అసైన్డ్‌ భూములను తీసుకునే హక్కు ఎవరికీ లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను గుంజుకుంటుందని విమర్శించారు. ‘వానాకాలంలో మీ భూములను మీరు దున్నుకోండి. ఎవరు అడ్డొచ్చినా ఎదురుతిరగండి. అప్పుడే మీ భూములను మీరు రక్షించుకుంటారు. మీకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. మీ భూములను మీరే కాపాడుకోవాలి. అర్నెల్లలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది’ అని భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్‌పల్లి గ్రామంలో పాదయాత్ర శిబిరం వద్ద మల్లు భట్టి విక్రమార్క విలేకర్లతో బుధవారం మాట్లాడారు. ఆర్నెల్ల తర్వాత ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు. ధరణి వెబ్‌పోర్టల్‌ సరిచేసి హక్కులు కల్పిస్తామన్నారు. అధికారికంగా పంచిన అసైన్డ్‌ భూములను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఫార్మాసిటీకి పేదల భూములే ఎందుకు తీసుకున్నారో చెప్పా లని ప్రశ్నించారు. వెట్టి చాకిరి నిర్మూలన కింద పంపిణీ చేసిన భూములను కూడా ప్రభుత్వం లాక్కొందని చెప్పారు. పేదలకు మూడెకరాల భూమిని ఇస్తామన్న బీఆర్‌ఎస్‌ మోసం చేసిందని విమర్శించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల పేదలకు పంచిన 10వేల ఎకరాలను లాక్కొని హెచ్‌ఎండీఏ లే అవుట్‌ చేసి అమ్ముకుంటుందని విమర్శించారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలోనే 5లక్షల కోట్ల విలువైన భూములు పేదల నుంచి లాక్కుందని ఆరోపించారు. ఇదేమి సంక్షేమ ప్రభుత్వమని ప్రశ్నించారు.
సోమేష్‌కుమార్‌పై సమగ్ర విచారణ జరపాలి
పేదల భూములు లాక్కునేందుకు రూపొందించిన ధరణి సృష్టికర్త, కుట్రదారు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌పై సమగ్ర విచారణ జరపించాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలను విచారణ కోరుతామన్నారు. సోమేష్‌ కుమార్‌ కేంద్ర సర్కారు పంపిన చోటికి పోకుండా ఇక్కడ సీఎస్‌గా కొనసాగారని విమర్శించారు.
బహుళజాతి కంపెనీలకు అంబాసిడర్‌ మంత్రి కేటీఆర్‌
పేదల భూములను లాక్కొని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టేం దుకు మంత్రి కేటీఆర్‌ అంబాసిడర్‌గా మారిపోయారని విక్రమార్క విమర్శించారు. ఆయన ప్రజల కోసం పని చేయటం లేదనీ, కార్పొరేట్‌ కంపెనీల కోసమే పని చేస్తున్నారని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ 30 ఏండ్లకు ఎందుకు లీజుకు ఇచ్చారని ప్రశ్నించారు. పాలకులకు లాభం చేకూర్చే స్కాంలకు బ్యురోక్రాట్స్‌ పని చేస్తున్నారని చెప్పారు. సోమేష్‌ కుమార్‌ను అడ్వైజరీగా వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.